యుక్తవయసులో అమ్మాయిలను ఎక్కువగా మొటిమలు, బాధిస్తుంటాయి. మొటిమల నివారణకు బ్యూటీపార్లర్కి వెళ్లకుండానే ఇంటి వద్ద నివారించుకోవడానికి కొన్ని చిట్కాలు ...- సానమీద కొద్దిగా నీళ్లు పోసి కమలాపండును అరగదీయాలి. ఇలా వచ్చిన గంధాన్ని మొటిమలు ఉన్న చోట రాయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి.
- బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి చర్మానికి అంటుకుని ఉంటే మొటిమలు పెరిగే అవకాశం ఉంది. అందుకని బయటకు వెళ్లి రాగానే ముఖాన్ని కడుక్కోవాలి. అలాగే పిల్లో కవర్స్, టవల్స్, మేకప్బ్రష్లు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- నిమ్మరసం, శనగనూనెను సమపాళ్లలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలిపి ముఖమంతా నెమ్మదిగా పది పదిహేను నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. తర్వాత నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మొటిమలు తగ్గిపోతాయి. ముఖ చర్మం మీద జిడ్డుపోయి తాజాగా ఉంటుంది.
- శనగనూనెలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి తరచూ మర్దన చేస్తుంటే సమస్య అదుపులో ఉంటుంది. కాస్త తేనెతో కూడా వాటి నుంచి విముక్తి లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఆ ప్రాంతంలో తేనె రాస్తే సరి.
- బొప్పాయి గుజ్జును తీసుకుని మొటిమలున్న చోట రాసి చల్లటినీళ్లతో కడిగేయాలి. అలాగే బంగాళాదుంపను సన్నటి ముక్కలుగా తరిగి ముఖం మీద వలయాకారంలో అరగంట పాటు బాగా రుద్దాలి. తరువాత ముఖం కడిగి మాయిశ్చరైజర్ రాయాలి.
- ఆరు లవంగాలను వేయించి పొడిచేసి అందులో కాస్త పెరుగు జోడించి, మొటిమల మీద రాయాలి. మర్నాడు కడిగేస్తే అవి తగ్గుముఖం పడతాయి. జిడ్డు చర్మతత్వం గలవారికి ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది.
- కమలాఫల తొక్కలపొడి కూడా సమస్య నుంచి బయటపడేస్తుంది. మూడు చెంచాల పొడిలో కాసిన్ని నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేయాలి. ఆరాక కడిగేస్తే ఫలితం ఉంటుంది. కప్పు గోరువెచ్చటి పాలలో నిమ్మరసం పిండి ముఖం కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే సమస్య నియంత్రణలో ఉంటుంది.
- మూడు చెంచాల తేనెలో చెంచా దాల్చిన చెక్క పొడి రాత్రి పడుకునేముందు రాసి, మర్నాడు గోరువెచ్చటి నీళ్లతో ముఖం శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికోసారి చేయాలి.
- పావు టేబుల్ స్పూన్ నిమ్మరసంలో రెండు టేబుల్స్పూన్లు తురిమిన కమలాతొక్కలు, కొంచెం పాలు కలిపి ఒక రోజంతా నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలు అనంతరం గోరువెచ్చని నీటితో కడిగితే జిడ్డు మాయం అవడం కాకుండా చర్మం మృదువుగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు చేస్తే ఫలితం బాగా ఉంటుంది.
- పింపుల్స్ వల్ల ఏర్పడిన నల్లమచ్చల నివారణకు బంగాళాదుంప రసాన్ని వాటిపై రాయాలి. మోచేతి వద్ద ఉండే నలుపు పోవాలంటే నిమ్మకాయ ముక్కలు, చక్కెరను కలిపి మర్దనా చేయాలి. అలసిన కళ్లకు విశ్రాంతి నివ్వడానికి కీరదోసకాయ ముక్కలను అరగంటసేపు కళ్లపై ఉంచుకుంటే చాలు.
- కొన్ని తులసి ఆకులు తీసుకుని రసం తీయాలి. అందులో చిటికెడు ఛాయ పసుపు కలపాలి. ముఖం మీద ఉన్న నల్లమచ్చలపై ఈ రసంతో నెమ్మదిగా మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
Post A Comment:
0 comments: